శునకానికి ఘనంగా దినకర్మ చేసిన యజమాని.. ముక్కున వేలేసుకున్న స్థానికులు!

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ డివిజన్ కేంద్రంలోని సీతంపేట రోడ్‌లో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి చేబోతుల రాజు జంతు ప్రేమికుడు. తన ఇంటి ఆవరణలో అహ్లాదకరంగా ఓ పార్కులా నిర్మించుకుని అందులో కుటీరం ఏర్పాటు చేశాడు. ఇందులో సుమారు 50 శునకాలకు ప్రతిరోజు ఆహారం పెడుతున్నాడు. అందులో టైసాన్ అనే ఓ సునకం గత 15 ఏళ్లుగా అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. అయితే టైసాన్ ఇటీవల మరణించింది. తన శునకం మృతి చెందినప్పటి నుంచి రాజు నిద్రాహారాలు మానేసి ఎంతో వ్యధ అనుభవిస్తున్నాడు. తన బాధను ఇతరులకు చెప్పుకోలేక గుండెల్లోనే దాచుకుంటూ కుమిలిపోయాడు. తాజాగా చనిపోయిన శునకానికి దినకర్మ చేయాలని నిర్ణయించుకున్నాడు.