సంక్రాంతి సందడి అప్పుడే మొదలైంది. బస్సు, రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరిగిపోయింది. పండక్కి ఎంత దూరమైనా, ఎంత ఖర్చయినా ఊరెళ్లాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఈ పరిస్థితిని ప్రైవేటు ట్రావెల్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. టిక్కెట్లు బ్లాక్ చేసి , రెండు మూడు రెట్లు దోచేస్తున్నారు. చివరికి ఏసీ బస్సులు ఫుల్ అయ్యాయంటూ , నాన్ ఏసీ టిక్కెట్లను కూడా ఏసీ రేట్లకు అమ్ముతున్నారు. మరోవైపున ఆర్టీసీ హౌస్ఫుల్ కావటం కూడా , ప్రైవేటు ట్రావెల్స్కి వరంగా మారింది. యాదాద్రి జిల్లా పంతంగి టోల్ప్లాజా దగ్గర వాహనాలు బారులు తీరాయి. హైదరాబాద్-విజయవాడ హైవేపై రద్దీ విపరీతంగా పెరిగింది. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో టోల్ ప్లాజా కిక్కిరిసింది. విజయవాడ మార్గంలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఫాస్టాగ్ లైన్లలోనూ వాహనాలు బారులు తీయాయి.