బతికి ఉన్నన్నాళ్లు ప్రజల కోసం చావడానికైనా సిద్ధం.. బండి సంజయ్ భావోద్వేగం

తాను కార్పొరేటర్‌ నుంచే కేంద్రమంత్రి స్థాయికి వచ్చానని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. తాను బతికినన్నాళ్లు ఒకే పార్టీ, ఒకే సిద్ధాంతంతో పనిచేస్తానని, ధర్మ రక్షణే ధ్యేయంగా, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు. అందుకోసం ఎందాకైనా పోరాడతానని బండి సంజయ్ పునరుద్ఘాటించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారి కరీంనగర్ లోని కాపువాడకు విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కు మున్నూరుకాపులు ఘన స్వాగతం పలికారు. కరీంనగర్‌ స్మార్ట్‌ సిటీకి నిధులు తీసుకొస్తానని, కరీంనగర్‌ జిల్లాను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం తీసుకుంటానని తెలిపారు.కరీంనగర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పనులు చేస్తానని బండి సంజయ్ ప్రకటించారు.