వరద ఉధృతిలో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు

వరద ఉధృతిలో చిక్కుకున్న వ్యక్తిని రక్షించారు సిర్పూర్(టి) ఎస్ఐ రమేష్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్(టి) మండలం హుడికిలి గ్రామం దగ్గర పెనుగంగా నది బ్యాక్ వాటర్ రావడంతో హుడికిలి లిఫ్ట్ ఇరిగేషన్ ట్యాంక్ చుట్టు వరద నీరు చేరుకుంది. వాటర్ ట్యాంక్ కింద తాత్కాలిక నివాసం ఉంటున్న గోపాల్ అనే వ్యక్తి వరద నీటిలో చిక్కుకున్నాడు. వెంటనే ట్యాంక్ పైకి ఎక్కాడు. ట్యాంక్ చుట్టూ కనుచూపు మేర ఎటు చూసిన వరద నీరు చేరుకోవడంతో.. బయటకు రాలేక భయాందోళన చెందాడు. ప్రాణం అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కున ట్యాంక్‌ పై గడిపాడు. విషయం తెలుసుకున్న సిర్పూర్(టి) ఎస్ఐ ధీకొండ రమేష్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నాడు. వాటర్ ట్యాంక్ పై నుండి తాడు సహాయంతో క్రిందకు దించి.. వరద నుంచి బయటకు తెచ్చారు. దీంతో గోపాల్ ఊపరిపీల్చుకున్నాడు. అతనికి నిత్యఅవసర వస్తువులు, దుప్పట్లు, బట్టలు ఇప్పించి సిర్పూర్(టి) లో పునరావాసం‌ కల్పించే ఏర్పాటు చేశారు ఎస్‌ఐ రమేష్.