ఒకే రోజు 25 మందిపై వీధి కుక్కల దాడి.. ఆసుపత్రికి క్యూ కట్టిన స్థానికులు.. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పాతిక మందిని కరిచేసాయి. పిచ్చికుక్కల స్వైర విహారంతో ఆ ప్రాంతంలోని ప్రజలంతా బెంబేలెత్తిపోయారు. ఏమి చేయాలో తెలీక కుక్కల మీద తిరగబడలేక నానా అగచాట్లు పడ్డారు. సీన్ కట్ చేస్తే అంతా ప్రభుత్వాసుపత్రికి క్యూ కట్టారు. గ్రామ సింహాల ధాటికి ప్రజలు వీధులలో కాకుండా ఇళ్ళలోకి పరుగులు తీశారు. కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని పదికి పైగా ప్రాంతాలలో పిచ్చికుక్కల స్వైరవిహారం చేశాయి. ఉదయం నుంచి కుక్కలదాడులతో ప్రభుత్వ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు బాధితులు. వీటి మధ్య వెళ్లాలంటే భయభ్రాంతులకు గురవుతున్నారు. బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ యార్డ్, వీరారెడ్డి కాలేజ్, సుమిత్రానగర్, ఐలమ్మ కాలనీ, ఆంజనేయ నగర్, పట్టణంలోని మరికొన్ని ప్రాంతాలలో నడుచుకుంటూ వెళుతున్న వారిపై పిచ్చి కుక్కలు దాడులు చేస్తున్నాయి. పిచ్చికుక్కల దాడిలో సుమారు 25 మందిపైగా గాయాల పాలై వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి చేరారు.