కానిస్టేబుల్ సమయస్పూర్తితో దక్కిన భక్తుడి ప్రాణాలు!

తిరుమల పోలీసులు మానవత్వం చాటుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ భక్తుడి ప్రాణం కాపాడారు. సంగారెడ్డి జిల్లాకు చెందిన మేడం శ్రీనివాసులు కుటుంబసమేతంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చారు. దర్శనం అయ్యాక లడ్డూ ప్రసాదాల కోసం కౌంటర్‌ దగ్గరికి వెళ్లారు. ఉన్నట్టుండి శ్రీనివాసులు కుప్పకూలిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న తిరుమల వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌ గురప్ప తక్షణమే స్పందించి సీపీఆర్‌ చేశారు. గుండెపోటుకు గురైన శ్రీనివాస్‌ను అశ్విని ఆస్పత్రిలో ప్రథమ చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్‌కు తరలించారు తిరుమల తిరుపతి దేవస్థానం సిబ్బంది. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించి ప్రాణం కాపాడిన కానిస్టేబుల్‌ గురప్పపై ప్రశంసలు కురుస్తున్నాయి.